కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకి తన వంతు సాయంగా రూ.1 కోటి 25 లక్షల రూపాయలని విరాళంగా బాలకృష్ణ అందించిన విషయం తెలిసిందే. రూ.25 లక్షల రూపాయలని లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీకి అందించగా, కోటి రూపాయల విరాళాన్ని రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధికి అందజేశారు.
బాలకృష్ణ దాతృత్వాన్ని మెచ్చిన చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ఆయనకి ధన్యవాదాలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు బాలకృష్ణ రూ.1 కోటి 25 లక్షల రూపాయలు విరాళం అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి కష్టసమయంలోను, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడు మాకు తోడుంటారు అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.